విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతున్నది

పరీక్షల నిర్వహణ  చేతగాని ప్రధాని మోడీ రాజీనామా చేయాలి

తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం నాయకుల డిమాండ్

నీట్ ప్రశ్న పత్రం లీకేజీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో సంఘీభావ ర్యాలీ

(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్)

కేంద్రంలోని మోడీ సర్కార్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నదని తెలంగాణ రక్షణసేన విద్యార్థి విభాగం నాయకులు మండిపడ్డారు. నీట్ ప్రశ్న పత్రం లీకేజీ కి బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రక్షణసేన విద్యార్థి విభాగం నాయకులు కందుల మధు, బొడ్డుపల్లి లింగం, అశోక్ యాదవ్ ల ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు ర్యాలీగా వెళ్తూ ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను మంత్రి వర్గం నుంచి తొలగించి పేపర్ లీకేజీ కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ రక్షణసేన తరఫున ప్రభుత్వంపై యుద్ధం చేస్తామని హెచ్చరించారు. 

విద్యార్థుల జీవితాలతో చెలగాటం-కందుల మధు

మోడీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని తెలంగాణ రక్షణసేన విద్యార్థి విభాగం నాయకులు కందుల మధు మండిపడ్డారు. సంఘటనకు బాధ్యతగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణ చేతకాని కేంద్రం వైఖరి కారణంగా…విద్యార్థులు చనిపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజీ ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన విద్యార్థులపై మావోయిస్టులు, ఉగ్రవాదులపై పెట్టిన కేసులు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముడి గుడిలో చోరీ జరిగిన, ప్రశ్నాపత్రాలు లీకైన మోడీ పట్టించుకోవటం లేదన్నారు. చేతకాని ఈ ప్రధాని వెంటనే రాజీనామా చేయాలని కందుల మధు డిమాండ్ చేశారు. 

Students march during a solidarity rally supporting nationwide NEET paper leak protests in Hyderabad.

విద్యార్థులకు న్యాయం చేయకపోతే యుద్ధం తప్పదు- బొడ్డుపల్లి లింగం

దేశంలో ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలకు మోడీ ప్రభుత్వం కేరాఫ్ అడ్రస్ గా మారిందని తెలంగాణ రక్షణసేన విద్యార్థి విభాగం నాయకులు బొడ్డుపల్లి లింగం విమర్శించారు. 2024 లో కూడా ఎన్టీఏ, యూజీసీ లు నిర్వహించిన పరీక్షలు లీకయ్యాయని గుర్తు చేశారు. పేపర్లు లీక్ చేస్తూ విద్యార్థుల జీవితాలను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. 

శాంతియుతంగా విద్యార్థులు ధర్నా చేస్తుంటే వాళ్లను ఇష్టానుసారంగా కొడతారా అంటూ ప్రశ్నించారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను బర్తరఫ్ చేసి.. భవిష్యత్ లో జరిగే పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. విద్యార్థులకు కేంద్రం భరోసా కల్పించాల్సిన అవసరముందన్నారు. లేని పక్షంలో ప్రభుత్వంపై యుద్ధం తప్పదని బొడ్డుపల్లి లింగం హెచ్చరించారు. 

బాధ్యత విస్మరించిన కేంద్రం- అశోక్ యాదవ్

పరీక్షల నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతను విస్మరించిందని తెలంగాణ రక్షణసేన విద్యార్థి విభాగం నాయకులు అశోక్ యాదవ్ అన్నారు. మోడీ ప్రభుత్వ ఘనకార్యంతో లక్షల మంది విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా 21 మంది విద్యార్థులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తప్పిదాలను ప్రశ్నించిన వాళ్లను కట్టడి చేస్తున్నారని విమర్శించారు. జరిగిన తప్పిదాలకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని కోరారు. ర్యాలీలో గుమ్మడి క్రాంతి, సీహెచ్ భగత్ యాదవ్, కొప్పుల అర్జున్, రాజ్ కుమార్, కశ్యప్ యాదవ్, సాయి నేత, అకిల్ రెడ్డి, మల్లిక్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Rakshana Sena student leaders conduct a solidarity rally at Osmania University in support of nationwide protests over the NEET paper leak.