పనులు నిలిచిపోయిన ఉప్పల్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిని పరిశీలించిన జాగృతి అధ్యక్షురాలు
జాగృతి జనంబాటలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గురువారం ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను పరిశీలించి పనుల ఆలస్యానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తేనే బ్రిడ్జి నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తవుతాయని కవిత అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపి ఈటల రాజేందర్ చొరవ చూపాలన్నారు.

“ఉప్పల్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిని కొన్ని ఏళ్లుగా కడుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ ఉప్పల్ ప్రజల పరిస్థితి మారటం లేదు. ఈ అంశంపై నేను శాసన మండలిలో ప్రశ్నిస్తే…మంత్రి కోమటి రెడ్డి స్పందించి త్వరలోనే సమీక్ష చేసి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఆ తర్వాత కాంట్రాక్టర్ ను మార్చారో లేదో తెలియదు కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. జాగృతి జనం బాటలో భాగంగా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తేవటానికి మేము ఇక్కడకు వచ్చాం. ఘట్కేసర్ వరకు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నారు. ఏళ్లుగా కడుతున్నారంటే ప్రజల పట్ల ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ది ఉందో తెలుస్తోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కో ఆర్డినేషన్ లేకపోవటం కారణంగానే ఆలస్యమవుతోంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనులు పూర్తి చేయించాలి. ఈ ప్రాంత ఎంపీ ఈటల రాజేందర్ ఇక్కడకు వచ్చి పరిస్థితిని చూడాలి.
సెంట్రల్ ప్రాజెక్ట్ కనుక బీజేపీ ఎంపీ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడకు వచ్చి నిరసన తెలిపి వెంటపడి పనులు చేయించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో త్వరితగతిన పనులు పూర్తి చేయాలి.
లేదంటే జాగృతి తరఫున మేమే ప్రభుత్వం వెంట పడి పనులు చేయిస్తాం.” “మేడ్చల్ – మల్కాజ్ గిరి జిల్లాలో నాలుగు రోజులు పర్యటిస్తాం. అన్ని నియోజకవర్గాల్లో మా జనం బాట సాగుతుంది. జనంబాటకు మద్దతిస్తున్న ప్రజలకు, మీడియాకు ధన్యవాదాలు.”