-కల్వకుంట్ల కవిత
- వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుకు ఈ ఎన్నికల్లో సహకారమే తొలిమెట్టు
- మహిళలకు ఇచ్చిన అన్ని హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి
- బడ్జెట్ లో నిధులు కేటాయించాలి.
ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ప్రజాభవన్ లో విజ్ఞాపన పత్రం సమర్పించిన జాగృతి
(ప్రజాభవన్, హైదరాబాద్)
బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు మున్సిపల్ ఎన్నికల్లో బయటపడ్డాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళలకు కాంగ్రెస్ ఇస్తామన్న రూ. 2500 వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మహిళలు, వృద్ధులు, వికలాంగులు సహా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో మంగళవారం ప్రజా భవన్ ముట్టడించారు. బేగంపేటలోని ప్రజాభవన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ చొరవ తీసుకుని మహిళలకు రూ.2,500, తులం బంగారం ఇవ్వడంతో పాటు పింఛన్ లు పెంచాలని నినాదాలు చేశారు. ఈ మేరకు ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్యకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును కవిత ఎండగట్టారు.


హామీలు అమలు చెయ్యాల్సిందే
మహిళలకు ఇస్తామన్న హామీలు ఈ ప్రభుత్వం నెరవేర్చలేదు. వాటిని పూర్తి చేయమని అడిగేందుకు ఇవ్వాళ ప్రజావాణికి వచ్చాం. ఇక్కడకు వస్తే సీఎం లేడు. రోజు ప్రజావాణిలో ఉంటానని చెప్పిన సీఎం ఒక్కసారి మాత్రమే ఉన్నాడు. మా విద్యార్థులు, మహిళలను పోలీసులు అరెస్ట్ చేసి దురుసుగా ప్రవర్తించారు. వారిని దుర్భాషలాడారు. ఇలాంటి పనులు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.
ఇవ్వాళ నేను ఇక్కడకు వచ్చే కార్యక్రమం లేదు. కానీ మా వారిని అరెస్ట్ చేస్తున్నారంటే వచ్చాను. మా అందరి దగ్గర ఆధార్ కార్డులు, అప్లికేషన్ ఫామ్ లు ఉన్నాయి. శాంతియుతంగా మేము ప్రజాభవన్ లో ఉన్న అధికారులకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం. ఫిబ్రవరి నెల 26 నుంచి బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ లో మహిళలకు ఇచ్చిన హామీలు రూ. 2500, స్కూటీలు, తులం బంగారం కోసం నిధులు కేటాయించాలి. ఈ ప్రభుత్వానికి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే. ఈ బడ్జెట్ లోనే నిధులు కేటాయించాలి. రూ. 2 వేల పెన్షన్ 4 వేలు చేయాలి. అన్ని హామీలను కూడా నెరవేర్చాలి. ఈ నెల 26 వరకు వేచి చూస్తాం. ఆ తర్వాత అన్ని జిల్లాల్లో ఉద్యమాలు చేపడతాం. అవసరమైతే సెక్రటేరియేట్, అసెంబ్లీ కూడా ముట్టడిస్తాం.
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే
మున్సిపల్ ఎన్నికల్లో అంతర్గతంగా బీజేపీకి బీఆర్ఎస్ సహకరించటం కారణంగానే ఒకటో, రెండో సీట్లు వచ్చాయి.
కరీంనగర్, నారాయణపేటలో ఛైర్మన్ ఎన్నికకు బీఆర్ఎస్ హాజరు కాలేదు. నారాయణ్ పేట్ లో మాకు వైస్ ఛైర్మన్ పదవి రావాల్సి ఉండే. కానీ కాంగ్రెస్ వాళ్లు బెదిరింపులకు దిగి వైస్ ఛైర్మన్ పదవి రాకుండా చేశారు. కచ్చితంగా వచ్చే అన్ని ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు అవుతాయి. వాటికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో అంతర్గత సహకారమే తొలి మెట్టు.
రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
రైతులకు బోనస్ ఇచ్చి ఘనంగా చెప్పుకుంటున్నారు. మీరు ఇస్తామన్నదే ఇచ్చారు తప్ప ఘనకార్యం చేయలేదు. రైతులకు ఇచ్చి మహిళలకు ఇవ్వలేదంటే వారి తరఫున మాట్లాడే వాళ్లు లేరనుకుంటున్నారా? ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టే ప్రయత్నం చేయకండి. మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నారు. కనీసం వారికిస్తామన్న రూ. 2500 అయినా ఇవ్వండి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి పోరాటాలు చేస్తుంది.








