తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ను కలిసిన జాగృతి ప్రతినిధి బృందం

ప్రభుత్వ ధనంతో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదినికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఫిర్యాదు చేశారు. తెలంగాణ జాగృతి నుంచి కవిత నేతృత్వంలో ప్రతినిధి బృందం స్టేట్ ఎలక్షన్ కమిషన్ ను కలిశారు. ఈ సందర్భంగా కవిత తమ అభ్యంతరాలను కమిషనర్ కు వివరించారు.

“సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో సీఎం టూర్ షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మేము అభ్యంతరం చెబుతున్నాం. అర్బన్ ఏరియాల్లో ప్రజాధనంతో మీటింగ్ పెట్టి సర్పంచ్ ఎన్నికల్లో సీఎం ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ టూర్ మీద ఆంక్షలు పెట్టాలి. లేదంటే నిలిపివేయాలని మొదటి రోజే మేము డిమాండ్ చేశాం. 

ఎన్నికల కమిషన్ కు లేఖ కూడా రాశాం. ఆ సందర్భంగా ఎన్నికల నియమావళికి అనుగుణంగా వ్యవహరించాలని ప్రభుత్వానికి సూచిస్తామని ఈసీ అధికారులు మాకు చెప్పారు. కానీ నిన్న, మొన్న సీఎం మాట్లాడిన మాటలు కచ్చితంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించే విధంగా ఉన్నాయి. ఆయన మాట్లాడిన మాటల కాపీలను మేము ఈసీకి అందజేశాం. గతంలో సర్పంచ్ ఎన్నికల సమయంలో రాష్ట్రం మొత్తం ఎలక్షన్ కోడ్ ఉండేది. కానీ ఆ తర్వాత మున్సిపాలిటీ పరిధిలో కోడ్ లేకుండా మినహాయింపు ఇచ్చారు. ఈ లూప్ హోల్స్ అడ్వాంటేజ్ గా చేసుకొని సీఎం గారు ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. ప్రభుత్వ ధనంతో నిన్న స్కూల్ పిల్లలను నింపి మీటింగ్ పెట్టారు. ఇది చాలా దారుణం. రాష్ట్రంలో ఫెయిర్ అండ్ ఫ్రీ గా ఎన్నికలు జరగాలంటే వెంటనే సీఎం టూర్ ని నిలిపివేయాలి. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతాం.” 

“అదే విధంగా చాలా ఏరియాల్లో వేలం నిర్వహిస్తూ సర్పంచ్ పదవిని సొంతం చేసుకుంటున్నారు. ఇది ఏ మాత్రం సరికాదు. గద్వాల్ లో కొన్ని ఊర్లలో ఆగడాలను కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. నల్గొండలో బీసీ బిడ్డను నిర్బధించి గెలవాలని చేసిన ప్రయత్నాన్ని కూడా చెప్పాం. ఐతే ప్రధానంగా సీఎం టూర్ ను నిలిపివేయాలని ఈసీని కోరాం. ఐతే సీఎం నిబంధనలను ఉల్లంఘించారేమోనని మొన్న మేము కలిసినప్పుడు ఈసీ అధికారులు భావించారు. కానీ సీఎం మాత్రం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు మేము ఇచ్చిన ఆధారాలతో కచ్చితంగా ఈసీ అధికారులు చర్య తీసుకోవాల్సిన అవసరముంది. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకుంటే సరే. కానీ ప్రజాధనంతో ఇలా చేయటం సరికాదు. ఎన్నికల కోడ్ రాజకీయ పార్టీలు ఎలా ఉల్లంఘిస్తాయన్న దానిపై నేను చాలా స్టడీ చేశాను. మన ముఖ్యమంత్రి తన హోదాను అడ్డం పెట్టుకొని సర్పంచ్ ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘిస్తున్నారు. ఈ అంశాన్ని మిగతా ప్రతిపక్షాలు కూడా సీరియస్ గా తీసుకోవాలి. 

ఓ పక్క ఓటు చోరీ గురించి కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోవటం లేదని రాహుల్ గాంధీ అంటారు. కానీ ఇక్కడ కూడా సీఎం కోడ్ ఉల్లంఘిస్తున్నారు. దాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకోవాలి. మేము ఇచ్చిన ఫిర్యాదుపై రేపు కూడా స్పందించకపోతే మళ్లీ, మళ్లీ రిప్రజెంటేషన్ ఇస్తాం. అదే విధంగా మీడియా ద్వారా ప్రజలకు ఈ అంశాన్ని జాగృతం చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాం.”