-కల్వకుంట్ల కవిత

బహదూర్ పురాలో జనంబాట

నగరంలోని పేదలకు హైడ్రా అన్యాయం చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా శనివారం బహదూర్ పుర నియోజకవర్గంలోని ఎన్ఎం గూడలో పర్యటించారు. స్థానికులతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  కిషన్ బాగ్ లో పేదల ఇళ్లను కూల్చేందుకు హైడ్రా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసిందన్నారు. ఇక్కడి నాలుగు ఇళ్లకు మార్క్ కూడా చేశారని తెలిసిందన్నారు. చెరువులను కాపాడాలనుకుంటే పేదలకు ప్రత్యామ్నాయంగా ఇళ్లను ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. 

ఇక్కడ పేద ప్రజలు చాలా మందికి ఇళ్లు లేవని కవిత చెప్పారు. భర్త చనిపోయిన స్త్రీలకు పదేళ్లుగా పెన్షన్ రావటం లేదని తెలిపారు. ఎన్ఎం గూడలో లోన్లు కూడా రావటం లేదని ప్రజలు చెబుతున్నారన్నారు. 

ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి పెన్షన్లు, లోన్లు వచ్చే ఏర్పాట్లు చేయాలని కోరారు. హైదరాబాద్ లో ఎక్కడికి వెళ్లినా సరే ప్రజలు రోడ్లు, మురుగు నీళ్లు, డ్రైనేజీ సమస్యలు చెబుతున్నారని వివరించారు. ఈ సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.