జనగామ జిల్లా జఫర్ ఘడ్ లోని తెలంగాణ ఉద్యమకారులు గాదె ఇన్నయ్య కుటుంబ సభ్యులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం పరామర్శించారు. ఇన్నయ్య తల్లి థేరేజమ్మ ఇటీవల కన్నుమూశారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఇన్నయ్య నిర్వహిస్తున్న ఆశ్రమాన్ని సందర్శించి అక్కడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు.
ఉద్యమానికి యువతను అందించారు
“తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి ఎవరూ మాట్లాడని సమయంలో దగాపడ్డ తెలంగాణ అనే పుస్తకాన్ని ఇన్నయ్య ప్రచురించారు. అంతేకాకుండా 1997 లో దగాపడ్డ తెలంగాణ అనే సభను నిర్వహించారు. తెలంగాణ గురించి ఎవరూ మాట్లాడని సమయంలో మనకు జరుగుతున్న అన్యాయాన్ని విప్పి చెప్పి ఎంతోమందిని ఉద్యమంలోకి తెచ్చారు.

ఎప్పుడు ఎవరికీ అన్యాయం జరిగిన సరే బలంగా ప్రజల పక్షాన, బాధితుల పక్షాన మాట్లాడే వ్యక్తి ఇన్నయ్య. మొన్నటి ఆపరేషన్ కగార్ లో జరిగిన ఎన్ కౌంటర్లపై కూడా తన భావాలు చెప్పటంతో ఆయనను అరెస్ట్ చేశారు. తెలంగాణ ఇటువంటి ఎన్నో అరెస్టులను చూసింది. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఇంత పెద్ద అన్యాయం జరగటం కరెక్ట్ కాదని భావిస్తున్నాం. ఇన్నయ్య ఎంతో ఉన్నత ఆశయంతో *మా ఇల్లు* అనే సంస్థను కూడా నడిపిస్తున్నారు. ఎంతో మంది అనాథ పిల్లలను పెంచి పెద్ద చేసి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దిన వ్యక్తి ఆయన. అలాంటి మా ఇల్లు సంస్థకు, ఇన్నయ్య గారికి జాగృతి తరఫున అండగా ఉంటాం. తెలంగాణ సమాజం కూడా ఇన్నయ్యకు మద్దతుగా ఉంటుందని భావిస్తున్నాం. ఉద్యమకారులను తెలంగాణ సమాజం ఎప్పుడూ మరిచిపోలేదు. తెలంగాణ కోసం ఎంతో మంది యువకులను ఉద్యమంలోకి తీసుకొచ్చిన వారు ఇన్నయ్య. అందుకే ఆయనకు మద్దతుగా వారి స్వగ్రామానికి రావటం జరిగింది. జాగృతి మద్దతు, సపోర్ట్ ఇన్నయ్యకు ఎప్పుడూ ఉంటుంది. ఉద్యమకారులను తెలంగాణ ఎప్పుడూ మరిచిపోదు.”









