సూర్యపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు ఉపాధ్యాయులను బలి తీసుకోవడం అత్యంత విషాదకరమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఎక్స్ వేదికగా మృతులకు సంతాపం ప్రకటించారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ టీచర్ తో పాటు కేజీబీవీ ఎస్ఓ కు రూ. కోటి బీమా అందజేయాలని కోరారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి రూ. కోటి బీమాపై ప్రకటన చేయాలన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కల్పన, గీతారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన మిగతా ఇద్దరు టీచర్లు కోలుకొని క్షేమంగా బయటకు రావాలని ఆకాంక్షించారు.
కోటి బీమా చేయాల్సిందే
ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ. కోటి బీమా కల్పిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేశారే తప్ప విధివిధానాలు ఖరారు చేయలేదని కవిత విమర్శించారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కష్టపడుతున్నారని తెలిపారు. వారికి ఉద్యోగ భద్రత లేదు.. సమాన పనికి సమాన వేతనం దక్కడం లేదు.. విధి వక్రించి వారికి ఏదైనా జరిగితే ఆ కుటుంబాలకు కనీస భద్రత లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కేజీబీవీ టీచర్లు, ఇతర కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.కోటి బీమా సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు.








