రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన కాంగ్రెస్
రోజువారీ ఖర్చుల కోసం ఆర్బీఐ దగ్గర చేయి చాచాల్సిన దుస్థితి తీసుకువచ్చంది
ఆర్థిక విధ్వంసం బయట పెట్టిన కాగ్
-తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
(హైదరాబాద్)
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. రోజువారీ ఖర్చులకు ఆర్బీఐ దగ్గర చేయి చాచాల్సిన దుస్థితిలోకి రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టేసిందన్నారు. కాగ్ 2024-25 నివేదికలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెల్లడించిన అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. అధికారంలోకి రాకముందు “సంపద పెంచుతాం.. పేదలకు పంచుతాం” అని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ ఖర్చులకు కూడా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద చేయి చాచాల్సిన పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రెండు రోజులు మినహా మిగతా అన్ని రోజులు ఆర్బీఐ నుంచి చేబదులుగా డబ్బులు తెచ్చి రాష్ట్రాన్ని నెట్టుకురావడం సిగ్గుచేటని అన్నారు. ఏడాది కాలంలో రూ.1.30 లక్షల కోట్లు చేబదులు అప్పులు తెచ్చి సర్కారును నడిపించటమంటే కచ్చితంగా అది చేతకాని తనమేనని విమర్శించారు. తెచ్చిన అప్పుల్లో మరో 6 వేల కోట్లు ఆర్థిక సంవత్సరం ముగిసినా చెల్లించలేదనే విషయాన్ని కాగ్ బట్టబయలు చేసిందన్నారు. నెలకు రూ. 12 వేల కోట్ల సొంత ఆదాయం ఉన్న తెలంగాణలో రోజువారీ కనీస అవసరాల కోసం రూ. 1.38 కోట్ల బ్యాలెన్స్ కూడా మెయింటెన్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు.
సంపద పెంచటంలో విఫలం
ఎన్నికలకు ముందు సంపద పెంచుతాం.. పేదలకు పంచుతామని కాంగ్రెస్ నాయకులు పెద్ద, పెద్ద మాటలు చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద పెంచటం మాట అటుంచితే కేవలం అప్పులతోనే కాలం గడుపుతున్నారని విమర్శించారు. ఇప్పటికే అడ్డగోలుగా రూ. 8.65 లక్షల కోట్ల అప్పులు చేసి, రాష్ట్రంలోని ఒక్కో కుటుంబంపై దాదాపు రూ. 9 లక్షల అప్పు భారాన్ని మోపారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతటి ఆర్థిక సంక్షోభంలో కూడా ఇంకా “మిగులు బడ్జెట్” అని చెప్పుకుంటూ తెలంగాణ ప్రజలను పచ్చి దగా చేస్తున్నారంటూ మండిపడ్డారు. కాగ్ నివేదికతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక విధ్వంసం బట్ట బయలైందన్నారు. ఇకనైనా ప్రచార ఆర్భాటాలు బంద్ చేసి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
అకాల వర్షాలు రైతులను ఆగం చేశాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల్లో అకాల వర్షాల కారణంగా చేతికొచ్చే దశలో ఉన్న పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. వందలాది ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న, మామిడి కాయలు నేలరాలాయని తెలిపారు. నువ్వులు, పసుపు, వరి పంటలకు తీరని నష్టం జరిగిందన్నారు. అకాల వర్షాల కారణంగా రైతుల కష్టం అంతా నేల పాలైందని విచారం వ్యక్తం చేశారు. సోమవారం అర్ధరాత్రి, మంగళవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.








