జాగృతి అధ్యక్షురాలిని కలిసిన షాహీ ఎక్స్ పోర్ట్ కార్మికులు
నాచారంలోని షాహీ ఎక్స్ పోర్ట్ కంపెనీలో  కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్  చేస్తున్న సిబ్బందికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు తెలిపారు.

బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవితను కలిసిన కార్మికులు తమ ఆవేదనను ఆమెకు విన్నవించారు. న్వాయబద్రిధమైన కార్మికుల డిమాండ్ ను వెంటనే నెరవేర్చడానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. 

కార్మికులది న్యాయమైన డిమాండ్

“షాహీ ఎక్స్ పోర్ట్స్ లో మహిళలు చేస్తున్న ఆందోళన అందరికీ స్ఫూర్తి దాయకం. ధర్నా చేస్తున్న మహిళలకు ఇబ్బంది అవుతుంది. కానీ వారి స్పిరిట్ కు మాత్రం సెల్యూట్. ఎట్టి పరిస్థితుల్లో సమస్య పరిష్కారమయ్యే వరకు వదల వద్దని మీకు సూచిస్తున్నా. 15 రోజుల నుంచి ఆడబిడ్డలు 2500 మంది రోడ్డుపై ఉంటే ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదు. 

లేబర్ కమిషనర్ ఎందుకు స్పందించటం లేదో నాకు అర్థం కావటం లేదు. లేబర్ మంత్రిగా ఉన్న వివేక్ వెంటనే దీని మీద ప్రొ యాక్టివ్ స్టెప్ తీసుకోవాలి. అసలు ప్రభుత్వం ఏ విషయాన్ని పట్టించుకోవటం లేదనటానికి షాహీ ఎక్స్ పోర్ట్ వాళ్ల ధర్నాయే నిదర్శనం. ఈ ఇష్యూ మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలని నేను డిమాండ్ చేస్తున్నా. దాదాపు 9 ఏళ్లుగా వాళ్ల జీతంలో మార్పు లేదు కానీ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. లేబర్ చట్టాలు అమలు చేయటం లేదు. కరవు భత్యం కూడా ఇస్తలేరు. ఆడబిడ్డల వైపు న్యాయం ఉంది. అందుకే వారు ఫైట్ చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలి. 

లేదంటే ఆడబిడ్డలతో కలిసి జాగృతి ఫైట్ చేస్తుంది. మేమే కాదు మిగతా కార్మిక నాయకులను కూడా తీసుకొస్తాం. లేబర్ చట్టాలు అమలు చేసేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. 2500 మంది ఆడబిడ్డలంటే మీ అందరికీ న్యాయం జరగాల్సిన అవసరం ఉంది.”