ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి
ఉచిత విద్య, వైద్యం మా పార్టీ విధానం
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత
(సోమాజిగూడ, హైదరాబాద్)
సమానత్వం, స్వేచ్ఛ, మాన విలువలు వర్థిల్లాలంటే విద్య ద్వారానే సాధ్యమని ప్రపంచం గుర్తించిందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. పిల్లల చదువు బాధ్యత తల్లితండ్రులది మాత్రమే కాదని, ప్రభుత్వానిది కూడా అధిక బాధ్యత ఉంటుందన్నారు. నాణ్యమైన విద్య – ఫీజుల నియంత్రణ అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్బులో బుధవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత మాట్లాడారు. అంతరాల భేదం లేకుండా అందరికీ ఉచిత విద్య అందాలన్న లక్ష్యంతోనే తాము టీఆర్ఎస్ స్థాపించామని ప్రకటించిన కవిత విశ్లేషణాత్మకంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
విద్యా వ్యాపారం జరుగుతున్నది
” ఇప్పుడున్న చాలా విద్యాసంస్థలు వ్యాపార ధోరణితో ఉన్నావే. వాటిలో రాజకీయ నాయకులకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. అసలు చదువుకు సంబంధించిన విధానం ఏంటి? హెల్త్, ఎడ్యుకేషన్ అనేది ప్రభుత్వాలకు అబ్లిగేషన్ గా ఉండాలి. ఉచిత విద్య, వైద్యం ప్రభుత్వాల బాధ్యతేనని నమ్మిన ప్రభుత్వాలు ఉండాలి. కానీ ప్రజలు ఏమైతే మాకేంటన్న ధోరణిలో ఫీజులు ఎంత పెంచినా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటామంటే కుదరదు. ఫీజులు కట్టలేక పంజాబ్ లో విద్యార్థులు పార్ట్ టైమ్ మద్యం అమ్ముకునే పరిస్థితి వచ్చింది. రాజకీయ నాయకులకే విద్యాసంస్థలు ఉండటమనేది కరెక్టా అనేది మనం ఆలోచించాలి. అదే విధంగా ఫీజుల దోపిడీకి మనకు ఇప్పుడే సొలుష్యన్ కావాలి. వచ్చే నెలలో మళ్లీ ఫీజులు కట్టాలన్న ఆందోళన పిల్లల తల్లితండ్రులకు ఉంటుంది.
చాలా మంది తల్లితండ్రులు ఇప్పటికే ఫీజుల విషయంలో భయంతో ఉన్నారు. తెలంగాణ వచ్చాక ఫీజుల నియంత్రణ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం తిరుపతిరావు కమిషన్ వేసింది.
ఆ కమిషన్ అధ్యయనం చేసి రిపోర్ట్ కూడా ఇచ్చింది. కానీ ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో బీఆర్ఎస్ సర్కార్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. గురుకులాలు ఏర్పాటు చేశామని…ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని పట్టించుకోమంటే కుదరదు. మన రాష్ట్రంలో 64 లక్షల మంది విద్యార్థులు ఉంటే 65 నుంచి 75 శాతం వరకు ప్రైవేట్ స్కూళ్లలోనే చదువుతున్నారు. పిల్లలు బాగా చదువుకోవాలన్న తల్లితండ్రుల వీక్ నెస్ ను వ్యాపార ధోరణిగా మార్చేశారు. ఈ ప్రభుత్వం కచ్చితంగా కార్పొరేట్ స్కూళ్ల దోపిడీని నియంత్రించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన జీవో ను తక్షణమే ఇవ్వాలి.
ఇప్పుడు జీవో ఇస్తేనే లక్షల మంది తల్లితండ్రులకు ఉపశమనం లభిస్తుంది. గతేడాదితో పోలిస్తే ఒక్క రూపాయి కూడా ఫీజు పెంచకుండా తక్షణమే జీవో ఇవ్వాలి.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అరాచకం
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనేది ప్రభుత్వ స్థలంలో ఉన్న స్కూల్. ఈ స్కూల్లో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 120 శాతం ఫీజు పెంచేశారు. ప్రభుత్వానికి చెందిన స్కూల్లోనే 120 శాతం ఫీజు పెంచటమంటే ఏంటీ దౌర్భాగ్యం. ఈ ముఖ్యమంత్రి ప్రైవేట్ స్కూల్ ఓపెనింగ్ లకు వెళ్తూ ఏం సందేశం ఇస్తున్నట్లు? ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని ముఖ్యమంత్రే ప్రోత్సహిస్తున్నట్లా? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 30 ఎకరాల భూమిని కొట్టేసే కుట్ర చేస్తున్నారు. అక్కడి కమిటీలో ముఖ్యమంత్రి బంధువులు, ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. అదే స్కూల్లో 14 ఏళ్లుగా ఒక పోస్టులో మహిళ ఉన్నారు. ఆమె బోర్డులోకి వచ్చిన వారికి అవినీతి ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. హైదరాబాద్ స్కూల్ లో చదివి గొప్ప వాళ్లు అయిన వాళ్లు డొనేషన్లు ఇస్తున్నారు. ఇటీవలే ఆ స్కూల్ పూర్వ విద్యార్థి సత్య నాదెళ్ల పెద్ద ఎత్తున విరాళం ఇచ్చారు. వాటన్నింటికీ అసలు ఎలాంటి లెక్క లేదు. విద్యాశాఖ మంత్రే ముఖ్యమంత్రి కావటం మన ఖర్మ. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వ్యవహారంలో కచ్చితంగా ముఖ్యమంత్రి రివ్యూ చేయాలి. ఈ విషయంలో ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకోవాలి.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 120 శాతం ఫీజు పెరిగితే…నారాయణ, చైతన్య లాంటి స్కూళ్లలో ఎంత పెంచుతారు?
విలువలతో విద్యనందించాలి
తెలంగాణలో చాలా మంది బడ్జెట్ స్కూళ్లను, కాలేజీలను నడిపించారు. కొంతమంది యువత కలిసి విద్యార్థుల తల్లితండ్రులకు భారం పడకుండా కాలేజీలు, స్కూళ్లు నడిపించారు. కానీ ఆ స్కూళ్లు నడవకుండా కార్పొరేట్ స్కూళ్లు కుట్రలు చేశారు. ఎథిక్స్ తో నడిచే స్కూళ్లతో మాకు ఎలాంటి సమస్య లేదు. తెలంగాణ సమాజానికి సమస్య ఉందంటే…తెలంగాణ రక్షణ సేనకు కూడా సమస్య ఉన్నట్లే. ఫీజుల దోపిడీకి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటి కావాలి. అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాల్సిన అవసరముంది. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో కూడా ఈ ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. దాదాపు 11 వేల కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయి. దీంతో కాలేజ్ లు మూతపడే పరిస్థితి వచ్చింది. ఫీజు రీయింబర్స్ మెంట్ ను బొంద పెట్టే విధంగా ఎంఎస్ -7 అనే జీవోను తెచ్చారు. పిల్లల తల్లితండ్రుల అకౌంట్ కు డబ్బులు వేస్తామంటున్నారు.
ఒకవేళ ఫీజులు చెల్లించకుంటే తల్లితండ్రులు పోరాటం చేసే పరిస్థితి ఉండదు. రైతు భరోసా విషయంలో కూడా ఇదే జరుగుతోంది. రైతు భరోసా వేయకపోతే రైతులు బయటకు వచ్చి పోరాటం చేసే పరిస్థితి లేదు. ఈ జీవో కొట్టివేసే వరకు అన్ని పార్టీలు పోరాటం చేయాల్సి ఉంది.
మాట తప్పను
ఉచిత విద్య, వైద్యం విషయంలో నేను మాట తప్పను. నేను ఆడపిల్లను. అబద్ధమాడను. ఇన్నాళ్లు అయ్యల పాలనలో మోసం జరిగింది. కానీ నేను అమ్మలా ఆలోచించే వ్యక్తిని. కచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా. ఫ్రీగా వైద్యం, విద్య ఇవ్వకపోతే అమరుల స్థూపం స్తంభానికి కట్టేసి కొట్టండి. తెలంగాణ రాష్ట్రం 1200 మంది అమరుల ప్రాణ త్యాగాలతో వచ్చింది. ఎంతోమంది విద్యార్థుల వీపుల మీద లాఠీ దెబ్బలు పడ్డాయి. ఆ విధంగా తెచ్చుకున్న రాష్ట్రంలో సంవేదనతో పాలన చేయాల్సి ఉండే. మేము అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక నిపుణులతో చర్చించిన తర్వాత ఉచిత విద్య, వైద్యం అనే అంశాన్ని పెట్టాం.
ఇవ్వాలనే మనసు ఉంటే కచ్చితంగా ఉచిత విద్య, వైద్యం ఇవ్వొచ్చు. తమిళనాడు తరహాలో మన వద్ద కూడా ఫీజు నియంత్రణ కోసం పర్మినెంట్ అథారిటీ ఉండాలి. లేదంటే గుజరాత్ లో మాదిరిగా ప్రాథమిక విద్యకు రూ.15 వేలు, ఉన్నత విద్యకు రూ.25 వేలకు మించి ఫీజు ఉండొద్దు.
ఇందులో ఏ మోడల్ ను అయిన స్టడీ చేసి ప్రభుత్వం వాటిని అమలు చేయాలి.








