నేరెళ్ల బాధితులకు ఇకనైనా న్యాయం చేయాలి

అడ్వొకేట్ జనరల్ ఈ కేసులో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

(తెలంగాణ రక్షణ సేన కార్యాలయం, హైదరాబాద్) :

నేరెళ్ల బాధితులకు ఇకనైనా న్యాయం జరిగేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శనివారం బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో నేరెళ్ల బాధితులు కల్వకుంట్ల కవితతో సమావేశమయ్యారు. సిరిసిల్ల జిల్లాలోని మానేరు నది నుంచి ఇసుక అక్రమ రావాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన తమపై అప్పటి ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరును బాధితులు వివరించారు. నేతల పరామర్శలే తప్ప తమకు న్యాయం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కవిత స్పందిస్తూ నేషనల్ ఎస్సీ కమిషన్, తెలంగాణ ఎస్సీ కమిషన్ నేరెళ్ల ఘటనపై విచారణ జరిపి రూపొందించిన నివేదికలు వెలుగు చూసేలా తాము ఒత్తిడి తీసుకువస్తామన్నారు. నేరెళ్ల బాధితులను రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకున్న కాంగ్రెస్, బీజేపీలు వారికి న్యాయం చేయడానికి మాత్రం అందుకు రాలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచిన తర్వాత కూడా నేరెళ్ల బాధితులకు న్యాయం జరగకపోవడం అత్యంత విచారకరమన్నారు. అడ్వొకేట్ జనరల్ ప్రత్యేక చొరవ తీసుకుని నేరెళ్ల బాధితుల పక్షాన గట్టి వాదనలు వినిపించి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నేరెళ్ల బాధితులు కోల హరీశ్, పెంట బాణయ్య వారి కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

టీఆర్ఎస్ కు నేరెళ్ల బాధితుడి విరాళం

తెలంగాణ రక్షణ సేన పార్టీకి నేరెళ్ల బాధితుడు పెంట బాణయ్య విరాళం ఇచ్చారు. శనివారం పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల కవితకు రూ.10 వేల విరాళం అందజేశారు. తమ పక్షాన గొంతు విప్పి న్యాయం చేయాలని కల్వకుంట్ల కవిత కోరుతున్నారు.. ఆమె స్థాపించిన టీఆర్ఎస్ పార్టీకి తన వంతు సాయంగా విరాళం అందజేశానని చెప్పారు