తెలంగాణ సమాగ్రాభివృద్ధికి జాగృతి బ్లూప్రింట్
పుష్కరకాల తెలంగాణ రాష్ట్ర స్థితిగతుల పరిశీలన
17న జాగృతి స్టీరింగ్ కమిటీకి నివేదిక – నివేదిక ఆధారంగా జాగృతి కార్యాచరణ | హైదరాబాద్
రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక వికాసానికి, చారిత్రక వారసత్వ సంపద పరిరక్షణకు, వివిధ వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న తెలంగాణ జాగృతి రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అడుగులు వేయనున్నది. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం బ్లూ ప్రింట్ రూపొందించడంలో నిమగ్నమయ్యింది.
జాగృతి జనంబాటలో భాగంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఉద్యమకారులు, వివిధ వర్గాల ప్రజల నుంచి తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వం అవసరమని సూచనలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రస్ఫుటింపజేసేలా రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో స్వీయ రాజకీయశక్తిగా నిలుస్తామని కవిత స్పష్టం చేశారు.
తెలంగాణ జాగృతి రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గం ఈ నెల 6 న మంగళవారం సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది. ప్రజాస్వామిక పద్ధతిలో అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలింపజేస్తూ కమిటీలు ఏర్పాటు చేసి వాటి నివేదికల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో జాగృతి ముఖ్య నాయకులు బుధవారం సమావేశమై ‘‘పుష్కరకాల తెలంగాణ రాష్ట్రం–సంపూర్ణ అధ్యయనం’’ సహా 32 కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని, రాష్టంలోని వివిధ రాజకీయ పార్టీల రాజ్యాంగాలను స్టడీ చేసి జాగృతికి ప్రజాస్వామ్యబద్ధమైన, పటిష్ఠమైన రాజ్యాంగాన్ని రూపొందించడానికి న్యాయ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశారు.

ఉద్యమకారుల సంక్షేమం, ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ, రాజ్యాంగ కమిటీ, బీఆర్ఎస్-కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలు, విద్య, వైద్యం, ఉద్యోగ, రైతు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీల సాధికారత, కార్మిక, సింగరేణి, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, లిటరేచర్, హిస్టరీ–హెరిటేజ్, కల్చర్, మేధావులు, ఎంప్లాయీస్, టీచర్స్, మహిళా సాధికారత, శిశు సంక్షేమం, యూత్ ఎంపవర్మెంట్, ఆన్ లైన్ కంటెంట్, ఇరిగేషన్, బడ్జెట్ ఎనాలిసిస్, మైనార్టీల సాధికారత, వలస (గల్ఫ్) కార్మికుల సంక్షేమం, విద్యార్థి, రెవెన్యూ సంస్కరణ విభాగాల్లో విద్యావంతులు, నిపుణులతో కమిటీలు ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో ముగ్గురు నుంచి నలుగురు సభ్యులను నియమించారు. ప్రతి కమిటీలో విధిగా విద్యావంతులైన మహిళా నాయకులకు అవకాశం ఇచ్చారు. కమిటీల బాధ్యులు రానున్న పది రోజుల పాటు వారికి అప్పగించిన రంగాల్లో రాష్ట్రవ్యాప్తంగా అధ్యయనం చేసి నివేదిక రూపొందిస్తారు. తమ నివేదికలను ఈనెల 17వ తేదీన జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ అధ్యక్షతన నియమించిన స్టీరింగ్ కమిటీకి సమర్పిస్తారు. ఆ నివేదికపై స్టీరింగ్ కమిటీ చర్చించి సమగ్ర కార్యాచరణ రూపొందిస్తుంది.









