12 ఏళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ సర్కార్, విభజన హామీలు సహా తెలంగాణకు రావాల్సిన నిధులపై కిక్కురుమనని ఆర్థిక మంత్రి
మోడీ నిత్యం వల్లవేసే కో-ఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఇదేనా? | హైదరాబాద్
వరుసగా 12వ ఏడాది కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణకు గుండు సున్నానే దక్కిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ పై ఎక్స్ వేదిక స్పందించారు. పన్నేండేళ్లుగా తెలంగాణను మోసం చేయటం బీజేపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. కో-ఆపరేటివ్ ఫెడరలిజం అంటూ ప్రధాని మోడీ నిత్యం చెబుతుంటారు కానీ ఆచరణలో మాత్రం పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విభజన హామీలు సహా తెలంగాణ ప్రాజెక్టులకు రావల్సిన నిధులన్నింటినీ పెండింగ్ లో పెట్టారని విచారం వ్యక్తం చేశారు. స్థిరత్వం, క్రమశిక్షణ, వృద్ధి అంటూ నినాదాలు చెప్పే బీజేపీ పెద్దలు ఎందుకు తెలంగాణ విషయంలో వివక్ష చూపుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
8 మంది ఎంపీలను ఇస్తే తిరిగి ఇచ్చింది గుండుసున్నా.
తెలంగాణ నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి మాత్రం గుండుసున్నా ఇచ్చారని మండిపడ్డారు. రాష్ట్రానికి నిధులు రావల్సిన దానికి బదులు పెండింగ్ ఫైల్స్ వస్తున్నాయన్నారు. రూ. 34, 367 కోట్లతో చేపట్టాల్సిన రీజినల్ రింగ్ రోడ్, హైవేలు, రేడియల్ రోడ్లకు నిధులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణకు ఇవ్వాల్సిన 50 శాతం నిధులు ఇవ్వలేదన్నారు. కొత్త రైల్వే లైన్లకు క్లియరెన్సులు ఇవ్వకపోగా, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీని అటకెక్కించారని మండిపడ్డారు. తెలంగాణకు దక్కాల్సిన ఐఐఎం, 16 నవోదయ విద్యాలయాలు, 9 కేంద్రీయ విద్యాలయాలను ఇవ్వటం లేదన్నారు. విభజన చట్టం హామీలైన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఏమీ ఇవ్వలేదన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయాల జాబితా చాంతాడంత ఉందన్నారు. ప్రధాని మోడీ చెప్పే కో ఆపరేటివ్ ఫెడరలిజం అంటే తెలంగాణ ప్రయోజనాలను కాలరాయటమేనా అని కవిత ప్రశ్నించారు.








