కార్యకర్తలు భారీగా తరలాలి, పార్టీ ఆవిర్భావం గ్రాండ్ గా జరపాలి
-కల్వకుంట్ల కవిత
(హైదరాబాద్)
ఏప్రిల్ 25న రాజకీయపార్టీని ప్రారంభించబోతున్న తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ఈ మేరకు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సుమారు 15 కమిటీలు ఏర్పాటు చేసి కార్యాచరణను ముమ్మరం చేశారు. జిల్లాల వారిగా శ్రేణులకు ఆదేశాలివ్వడానికి ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో బుధవారం మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయా జిల్లాల నుంచి పార్టీ లాంచింగ్ కార్యక్రమానికి ఎంతమంది కార్యకర్తలు రానున్నారు, రవాణా ఏర్పాట్లపై వారితో చర్చించారు. మేడ్చల్ సమపంలోని అద్వయ కన్వెన్షన్ హాల్ లో జరగనున్న పార్టీ అవతరణ కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలి రావాలని కవిత పిలుపునిచ్చారు. ఈ నెల 25న ఉదయం 8 గంటలకే కార్యక్రమాలు ప్రారంభం కానునండటంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చే వారు తెల్లవారు ఝామునే బయలుదేరాల్సి ఉంటుందని ఆమె సూచించారు. కార్యకర్తలను తరలించే ప్రక్రియలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.రూప్ సింగ్, ప్రధానకార్యదర్శి నవీనాచారి, యువజన విభాగం అధ్యక్షుడు శివారెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు మరిపల్లి మాధవి, ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి తదితరులు జిల్లాల నాయకులతో చర్చించి ఏర్పాట్లపై సూచనలు చేశారు.

పోస్టర్ ఆవిష్కరణ
కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ఈ నెల 25న ప్రారంభం కానున్న రాజకీయ పార్టీ అవతరణకు సంబంధించి తెలంగాణ జాగృతి యువజన సమైక్య హైదరాబాద్ అధ్యక్షుడు పరకాల మనోజ్ కుమార్ ఆధ్వర్యలో రూపోందించిన పోస్టర్ ను కవిత ఆవిష్కరించారు. సామాజిక తెలంగాణ కోసం ఉద్భవించబోతున్న మన కవితక్కపార్టీ-ఇది మనందరి పార్టీ అనే నినాదంతో పోస్టర్ రూపోందించారు.








