ఆ నాలుగు అంశాలు పరిష్కరించాలి
ప్రధాని మోడీకి టీఆర్ఎస్ చీఫ్ కవిత బహిరంగ లేఖ
తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి నాలుగు కీలక అంశాలు ప్రస్తావన
(హైదరాబాద్)
ప్రధాని నరేంద్రమోడీ మే 10 న ఆదివారం తెలంగాణ పర్యటనకు రానున్న నేపథ్యంలో తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలంటూ తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ఆయనకు బహిరంగ లేఖ రాశారు. పాలమూరు-రంగారెడ్డి కి జాతీయ హోదా, జనగణనలో బీసీ గణన, మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా, తెలంగాణ బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలంటూ లేఖలో కోరారు. వాటికి సంబంధించి వివరాలను లేఖలో పేర్కొన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (PRLIS) “జాతీయ హోదా”:
మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ వంటి కరువు ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు జీవనాడి లాంటిది.12.31 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి. 90 శాతం కేంద్రం నిధులతో వెంటనే ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలి.
2027 జనగణనలో బీసీ గణన:
దేశంలో బీసీల జనాభాపై కచ్చితమైన గణాంకాలు లేవు. దీని కారణంగా ఆయా వర్గాలకు అందాల్సిన అభివృద్ధి పథకాలు అందరికీ చేరడం లేదు. అందువల్ల రాబోయే 2027 జనాభా లెక్కల్లో బీసీల కోసం ప్రత్యేక కాలమ్ను చేర్చాలి. వారి కులాల పేర్లు స్పష్టంగా పేర్కొనేలా జనాభా గణన ఉండాలి.
మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ సబ్ కోటా:
చట్టసభల్లో మహిళలకు కేటాయించే 33 శాతం రిజర్వేషన్లలో బీసీ మహిళలకు ప్రత్యేక సబ్ కోటా కల్పించాలి. అప్పుడు మాత్రమే వెనుకబడిన వర్గాల మహిళలకు రాజకీయంగా సమాన అవకాశాలు లభిస్తాయి. బిల్లులో కచ్చితంగా ఈ సవరణ చేయాల్సిందే.
తెలంగాణ బీసీ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం:
తెలంగాణ ప్రభుత్వం విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ బిల్లు చేసింది. దీనికి రాష్ట్రపతి ఆమోదం పొందేలా కేంద్రం సహకరించాలి.
ఈ నాలుగు డిమాండ్లను పేర్కొంటూ ప్రధాని మోడీకి కవిత లేఖ రాశారు. తెలంగాణకు మేలు చేసే ఈ అంశాలపై రాష్ట్ర బీజేపీ ఎంపీలు దృష్టి సారించాలన్నారు. ఈ అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి ఆయనను ఒప్పించాలని కోరారు.








